2015 లో తెలంగాణ లో జరిగిన వోట్ కి నోట్ కేసు లో చంద్రబాబు ని ఎలాగైనా నిందితుడిగా చేరుద్దామని శతవిధాలా ప్రయత్నించిన మంగగిరి గిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆశలు అడియాసలు అయ్యాయి.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆళ్లరామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం డిస్మిస్ చేసింది.
జస్టిస్ సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం మందలించింది. ఇంతకుముందు ఈ కేసు లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది.
పిటిషనర్ రాజకీయ నేపథ్యం ఏమిటని ధర్మాసనం అడిగింది, పిటిషనర్ ఆళ్ళ ,2014 నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ప్రతిపక్షంలో ఉందని సీఎం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు.
తీర్పు సందర్భంగా ధర్మాసనం చేసిన తీవ్ర వ్యాఖ్యలు
“రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేసుకోవద్దు. ఆధార రహిత అంశాలను తీసుకువచ్చి కోర్టుతో ఆటలాడుకోవద్దు, కావాలంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి, అంతే తప్ప రాజకీయ కక్షల కోసం ధర్మాసనం వద్దకు రావొద్దు. “
ఈ తీర్పు తరువాత, రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది , ఇదే ఓటుకు నోటు వ్యవహారంపై సుప్రీంకోర్టులో వేరే కేసులు కూడా ఉన్నాయని ధర్మాసనం ఎదుట ఓ జాబితా పెట్టారు
ఆ కేసులకు, ఇప్పుడు వాదనలు జరుగుతున్న కేసులకు సంబంధం లేదన్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా పేర్కొన్నారు.
కేసుల జాబితా చూశాక పిటిషనర్ రామకృష్ణారెడ్డిపై ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు కనపడటం లేదని తెలిపింది.